టిడిపి ప్రచార రథానికి నిప్పు

– డ్రైవర్‌కు గాయాలు- రోడ్డుపై బైఠాయించిన కార్యకర్తలు
ప్రజాశక్తి-వాల్మీకిపురం (అన్నమయ్య జిల్లా):అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విఠలం సమీపంలో గుర్తు తెలియని దుండగలు టిడిపి ప్రచార రథానికి నిప్పు పెట్టారు. డ్రైవర్‌కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించి టిడిపి కార్యకర్తల కథనం మేరకు..వాహనంలో డ్రైవర్‌ రాజు ఉండగానే గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు. చాకచక్యంగా డ్రైవర్‌ తప్పించుకున్నప్పటికీ గాయాలయ్యాయి. స్థానికులు గమనించి డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పీలేరు నియోజకవర్గం టిడిపి అభ్యర్థి నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి సతీమణి నల్లారి తనూజారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని, సంఘటనకు గల కారణాలను కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ప్రచార రథం డ్రైవర్‌ను పరామర్శించి, విఠలం సమీపంలో రోడ్డుపై బైఠాయించారు. వైసిపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిథున్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులను పట్టుకుంటామని పోలీసులు చేపడంతో ఆందోళన విరమించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు.

➡️