అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

  • లేనియెడల తల్లి బిడ్డలకు ఎదురయ్యే సమస్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి-అమరావతి : అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటన కోరారు. లేనియెడల తల్లి బిడ్డలకు ఎదురయ్యే సమస్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ డిసెంబర్‌ 12 నుండి చేస్తున్న సమ్మెకు సిపిఐ(యం) సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రభుత్వ విచ్చిన్న ఎత్తుగడలను ఎదుర్కొని కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా నిలబడాలని, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల తరగతుల ప్రజలు, ప్రజాతంత్ర వాదులు అంగన్‌వాడీలకు సంఘీభావంగా నిలబడాలన్నారు. 2019 ఎన్నికల్లో అంగన్‌వాడీలకు తెలంగాణా మీద వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని వాగ్ధానం చేసి, ముఖ్యమంత్రి అయ్యాక జగన్‌ మాట తప్పారన్నారు. కనీస వేతనం అమలు చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని అమలు చేయాలని, రిట్కెర్మెంట్‌ బెనిఫిట్స్‌ పెంచి, పెన్షన్‌ 50% అమలు చేయాలనే కనీస కోర్కెలు అమలు కోసం గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు.. కార్మికులు దశలవారీగా అనేక రూపాలలో ఆందోళనల తరువాత విసిగి వేసారి చిట్ట చివరకు సమ్మెకు దిగారన్నారు. ఈ సమ్మెను నివారించే అవకాశం ఉన్నా ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల ప్రభుత్వ అధికారులు, సచివాలయ ఉద్యోగులు అంగన్‌వాడీల కేంద్రాల తాళాలు పగులగొట్టి చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకుంటున్నారని తెలిపారు. కొంతమంది అధికార పార్టీ ఎమ్మేల్యేలు బాధ్యాతారహితంగా మాట్లాడుతున్నారని తెలిపారు. అంగన్‌వాడీలపై నోరుపారేసుకున్న బొబ్బిలి ఎమ్మేల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కొన్ని చోట్ల వైసిపి కార్యకర్తలు టెంట్లు పీకేస్తున్నారని.. ఈ చట్ట విరుద్ధ చర్యలను పోలీసులు దగ్గరుండి జరిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా సాగుతున్న సమ్మెను శాంతి భద్రతల సమస్యగా మార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు. ఈ సమ్మెకు పోలీసులు, సచివాలయ ఉద్యోగులు దూరంగా ఉండాలని చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని కోరారు. ప్రశాంతంగా జరిగే సమ్మెను అక్రమ పద్దతుల ద్వారా విచ్చిన్నం చేసే ప్రభుత్వ యత్నాలను సిపిఎం ఖండిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞతతో అంగన్‌వాడీ కార్మికుల సమస్యల పరిష్కరించేందుకు చొరవచూపి సమ్మెను విరమింపజేయాలని కోరారు.

➡️