ప్రజాశక్తి-అమరావతిబ్యూరో:రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీచేసే అభ్యర్థులను వైసిపి ప్రకటించింది. వైసిపి సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, కడప జిల్లాకు చెందిన మేడా రఘునాథ్రెడ్డిని రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది. ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అసెంబ్లీ ఆవరణలోని సిఎం కార్యాలయంలో గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కనకమేడల రవీంద్రకుమార్ పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. మేడా రఘునాథ్రెడ్డి స్థానంలో ముందు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేరును ప్రతిపాదించారు. టిడిపి అభ్యర్థిని రంగంలోకి దించితే సమస్య రాకుండా ఆర్థికంగా బలమైన మేడా రఘునాథ్రెడ్డి పేరును తెరపైకి తెచ్చినట్లు తెలిసింది.