ప్రజాశక్తి – వేంపల్లె (వైఎస్ఆర్ జిల్లా) :పోలింగ్ బూత్లో ఇవిఎంలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పిసిసి అధ్యక్షులు, కడప కాంగ్రెసు ఎంపి అభ్యర్థి షర్మిల అన్నారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ పంచాయతీలోని మల్లెలమ్మపల్లెలో భర్త బ్రదర్ అనిల్కుమార్తో కలిసి షర్మిల సోమవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటు వేయడం ఒక భాధ్యతన్నారు. పాలకులను ఎంచుకొనే హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిందని తెలిపారు. కడప జిల్లా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలో జరుగుతున్న దాడులపై ఇసి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరారు. రాజంపేట నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ను ధ్వంసం చేసిన వైసిపి అభ్యర్థిని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కడప ఎంపిగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.