క్రికెట్‌ ఆడుతుండగా విషాదం.. గుండెపోటుతో టెకీ మృతి..

హైదరాబాద్‌ : క్రికెట్‌ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఓ యువ టెకీ మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. విశాఖ జిల్లా పెద్దగంట్యాడ మండలం మీంది గ్రామానికి చెందిన కాశిరెడ్డి సంజరు భార్గవ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్న అతడు గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి వద్ద ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నాడు. శనివారం ఉదయం అతడు గచ్చిబౌలి నుంచి తన స్నేహితులు దిలీప్‌, బాలప్రదీప్‌ అజరు, తేజకిరణ్‌, ఆదిత్యలతో కలిసి ఘట్టుపల్లిలోని క్రికెట్‌ స్టేడియానికి వచ్చాడు. అయితే, మధ్యాహ్నం క్రికెట్‌ ఆడుతున్న సమయంలో తలనొప్పిగా అనిపించడంతో అతడు ఆట మధ్యలో పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఆ తరువాత అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు తేల్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

➡️