ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినవారు నిబంధనలకు విరుద్ధంగా టిడిపి అభ్యర్థికి అనుకూలంగా ప్రచారాల్లో పాల్గొంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్ చేసింది. వైసిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్సెల్ రాష్ట్ర అధ్యక్షులు అంకంరెడ్డి నారాయణమూర్తి, లీగల్ సెల్ నాయకులు శ్రీనివాసులురెడ్డి సోమవారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. పులివెందులలో 12 మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసినవారు బహిరంగంగా టిడిపి అభ్యర్థికి ప్రచారం నిర్వహిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సిఎం జగన్పై ఈ నెల 5న తంబళ్లపల్లి, ధర్మవరంలో సభల్లో చంద్రబాబు వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫేక్ సర్వేలతో ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు.