అనంతపురం : యశ్వంతపూర్ నుండి రాయదుర్గం మీదుగా కారటగి మధ్య ప్రతిరోజు తిరిగే ఎక్స్ ప్రెస్ రైలు ఆదివారం ఉదయం 4:40 నిమిషాలకు రాయదుర్గం రైల్వే స్టేషన్లో ఒకటో నెంబర్ ప్లాట్ ఫారం చేరుకోవాల్సి ఉండగా మధ్యలో ఉన్న మెయిన్ లైన్ మీదకు వచ్చి ఆగింది. ఒకటి, రెండు ప్లాట్ ఫారంలపై అప్పటికే గూడ్స్ బండ్లు ఆగి ఉండడంతో తప్పనిసరి పరిస్థితులలో మెయిన్ లైన్ లో ఆపినట్లు స్టేషన్ మాస్టర్ మహేష్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులకు ఎటువైపు దిగాలని తెలియక తికమక పడుతూ రైలులోనుంచి అటువైపు కొంతమంది, ఇటువైపు కొంతమంది కిందకు దిగి, గూడ్స్ రైళ్ల మధ్య సందుల్లో నడుచుకుంటూ వచ్చారు. కొంతమంది మహిళలయితే చెప్పులు లేకపోవడంతో పిల్లలను, లగేజీని కష్టం మీద మోసుకుంటూ వచ్చారు. దీనిపై స్టేషన్ మాస్టరును వివరణ కోరగా ఓబులాపురం స్టేషన్లో ఒక గూడ్స్ రైలు ఇంజన్ మొరాయించడంతో అది అక్కడే ఒక ప్లాట్ ఫారం పై ఆగిపోయినట్లు తెలిపారు. పుట్టపర్తి రైలు మార్గంలో సొరంగం నిర్మాణం పనులు జరుగుతున్న నేపథ్యంలో … ఆ మార్గం మీద ప్రయాణించే గూడ్స్ రైలు కూడా రాయదుర్గం- బళ్ళారి- చిక్కజాజూరు మార్గం మీదుగా మళ్లించడంతో సగటున రోజుకు 30 వరకు గూడ్స్ రైళ్లు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నట్లు వివరించారు. కారటిగి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలు రాయదుర్గం స్టేషనుకు వచ్చినప్పుడు రెండు ఫ్లాట్ ఫారంలలో రెండు గూడ్స్ రైళ్లు ఆగి ఉండటంతో రైలును ప్రయాణికుల సౌకర్యార్థం సకాలంలో గమ్యస్థానానికి చేర్చాలనే ఉద్దేశంతో స్టేషన్ మధ్యలో ఉన్న మెయిన్ లైన్ లో ఆపినట్లు తెలిపారు. లేనిపక్షంలో కారటిగి ఎక్స్ప్రెస్ ను మొలకల్మూర్ స్టేషన్లో ఆపితే రెండు గంటలు ఆలస్యంగా రైలు రాయదుర్గంకు వచ్చేదన్నారు. ప్రయాణికులు ఎక్కి దిగేందుకు అదనంగా పదిహేను నిమిషాలు రైలును రాయదుర్గంలో ఆపినట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైలును సరైన సమయంలో స్టేషనుకు చేర్చామని, ప్రయాణికులు గమనించి సహకరించాలని స్టేషన్ మాస్టర్ మహేష్ రెడ్డి కోరారు.