ఇంటర్నెట్డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ తారలు సల్మాన్, అమీర్, షారుక్ఖాన్లు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్కి తరలివెళ్లారు. గుజరాత్ జూమ్ నగర్లో జరుగుతున్న పెళ్లికి అతిథులుగా వెళ్లి డ్యాన్స్ స్టెప్పులేశారు. ఈ స్టార్లంతా కూడా అంబానీ ఆతిథ్యం స్వీకరించడానికే కాదు.. ఈ పెళ్లి వల్ల వాళ్లు కూడా.. కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికే వెళ్లారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తెరవెనుక కోట్ల రూపాయల డీలింగ్స్ జరగబట్టే వారంతా పెళ్లికి వెళ్లారని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గతంలో తనకు కూడా ఇలాంటి ఆఫర్సే వచ్చాయని, కానీ తాను మాత్రం ఆత్మగౌరవం చంపుకోలేదని కంగన పోస్టులో తెలిపింది. ‘ఆర్థికంగా నేను చాలా దారుణమైన పరిస్థితుల్ని ఫేస్ చేశాను. అలాంటి సమయంలో కూడా ఎవరెన్ని రకాలుగా ప్రలోభ పెట్టాలని చూసినా సరే పెళ్లిళ్లలో డ్యాన్స్లాంటివి చేయలేదు. ఐటమ్ సాంగ్స్ చేయమని కూడా ఆఫర్స్ వచ్చాయి. కానీ నేను చేయలేదు. కొన్నాళ్ల తర్వాత నేను అవార్డు షోలకు వెళ్లడం కూడా మానేశాను. ఇలా డబ్బు, ఫేమ్ వద్దని చెప్పడానికి ఆత్మగౌరవం చాలా కావాల్సి ఉంటుంది.’ అని కంగనా తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు.
ఇక ఈ పెళ్లికి హాజరైతే బాలీవుడ్ స్టార్లకు ఒక్కో సినిమాకు అయ్యేంత రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. బహుశా అందుకేనేమో ప్రీ వెడ్డింగ్కే వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని టాక్. ఇక ఈ పెళ్లికి బాలీవుడ్ తారలతోపాటు, దక్షిణాది నుంచి రామ్చరణ్, రజనీకాంత్ దంపతులు కూడా హాజరయ్యారు. మరి ఈ స్టార్లకు ఎంత మొత్తంలో డబ్బులు ఇచ్చారో అనే సందేహం వస్తుంది.