జపాన్ : జపాన్ బుల్లెట్ ట్రైన్లో ఓ పాము హల్చల్ చేసింది. దీంతో ఆ రైలు 17 నిముషాలపాటు ఆగిపోయింది.. ప్రయాణీకులందరినీ వేరే రైలులో సురక్షితంగా చేర్చారు. జపాన్ రైల్వేస్ 1964లో బుల్లెట్ రైలు సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ప్రమాదం లేదా మరణం సంభవించలేదు. ఈ రైళ్లు గంటకు 285 కిలోమీటర్ల వేగంతో దూసుకెళతాయి. ఈ రైళ్ల సగటు ఆలస్య వ్యవధి కేవలం 0.2 నిమిషాలే.
గత మంగళవారం సాయంత్రం నగోయా నుంచి టోక్యోకు వెళ్లే బుల్లెట్ రైల్లో ఓ పాము దూరడంతో ప్రయాణికుల్లో కలకలం రేగింది. రైల్లో ఓ 40 సెంటీమీటర్ల చిన్న పాము కదులుతుండటాన్ని ప్యాసింజర్ ఒకరు గమనించి వెంటనే భద్రతా సిబ్బందికి తెలిపారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బుల్లెట్ రైలును 17 నిమిషాలపాటు ఆపారు. ప్రయాణికులను మరో రైల్లోకి తరలించి గమ్యస్థానం చేర్చారు. అయితే రైల్లోకి ఆ పాము ఎలా వచ్చిందో తెలియలేదు. అలాగే ఆ పాము విషపూరితమైనదా కాదా అనేది కూడా వెంటనే తెలియరాలేదు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదని సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
చిన్న కుక్కలు, పిల్లులకు అనుమతి కానీ…
జపాన్ రైల్వేస్ నిబంధనల ప్రకారం … బుల్లెట్ రైళ్లలోకి ప్రయాణికులు చిన్న కుక్కలు, పిల్లులు, పావురాలు లాంటి వాటిని తెచ్చుకోవచ్చు. కానీ పాములను తీసుకెళ్లేందుకు మాత్రం అనుమతి లేదు. ”రైళ్లలోకి పాములు దూరతాయని ఊహించడం కష్టమే. బుల్లెట్ రైళ్లలోకి పాములను తీసుకురాకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ మేం ప్రయాణికుల బ్యాగ్ లను తనిఖీ చేయం” అని రైలు కంపెనీ ప్రతినిధి వివరించారు.