ఇంటర్నెట్డెస్క్ : ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకి ఎంపికైంది. ద బెస్ట్ ఒర్జినల్ సాంగ్ అవార్డ్ కేటగిరిలో ఆస్కార్కి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి ఎంపికైన సంగతి తెలిసిందే. నాటునాటు పాట ఆస్కార్ అవార్డుకి ఎంపికవుతుందని కీరవాణి గట్టి నమ్మకంతో ఉన్నాడని తన తమ్ముడు, ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి అన్నారు. ఈ వేదికపై మాట్లాడేందుకు కీరవాణి కొన్నిరోజులు ప్రాక్టీస్ చేశాడని ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ని రాజమౌళి బయటపెట్టాడు. ‘ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమంలో మాట్లాడేందుకు కేవలం 45 సెకన్లే ఉంటుంది. దీనికోసం కీరవాణిని మూడు వారాల ముందు నుంచే స్పీచ్ ప్రాక్టీస్ చేయించాం. అతను కొంచెం లావుగా ఉండడంతో.. చెయిర్ పై నుంచి లేచి స్టేజ్ పైకి వెళ్లే సమయంలో కాస్త ఊపిరి ఆడనట్టుగా అవుతుంది. అందువల్ల మేము ఇంటి దగ్గర తనను మెల్లగా నడిచి వెళ్లి మాట్లాడమని చెప్పాం. చెయిర్లో నుంచి లేచి మెట్లు ఉన్న వేదికపై ఎక్కి కాస్త ఊపిరి పీల్చుకొని మాట్లాడేలా మూడువారాలపాటు ప్రాక్టీస్ చేయించాం. కానీ అవార్డు అందుకనే రోజు కీరవాణి తన ప్రాక్టీస్ అంతా పక్కన పెట్టేశాడు. స్టేజీపై తన పేరు పిలవగానే అవార్డు అందుకోవడానికి చాలా వేగంగా నడుచుకుంటూ వెళ్లాడు. కానీ ఎలాగోలా ఊపిరి బిగపట్టుకొని స్పీచ్ కూడా పూర్తి చేశాడు. టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటూ ఓ పాట కూడా పాడాడు. అయితే ఇదే పాటను మరుసటి రోజు రిచర్డ్ లిన్ కార్పెంటర్ (అమెరికన్ సంగీతకారుడు, గాయకుడు) తన కుమార్తెలతో కలిసి ఈ పాటను పాడి మా అన్నకు ట్రిబ్యూట్ ఇచ్చాడు. అప్పుడే అతను కంటతడి పెట్టాడు.’ అని రాజమౌళి ఇటీవల జపాన్లోని థియేటర్లలో ఆర్ఆర్ఆర్ మూవీని చూసి.. అక్కడి ప్రేక్షకులతో మాట్లాడుతూ.. ఈ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.