2 కచ్చిడి చేపల ధర రూ.4 లక్షలా…!

Apr 14,2024 14:38 #fish, #rs.4 lakhs

అంబేద్కర్‌ కోనసీమ : కృష్ణా జిల్లా మత్స్యకారుల పంట పండింది… కచ్చిడి చేప వలకు చిక్కింది. ఎక్కడో సముద్రపు అడుగుభాగంలో ఉండే ఈ అరుదైన చేప వలకు చిక్కడం అంటే విశేషమేమరి..! పులస చేప వేలల్లో పలికితే … ఈ కచ్చిడి చేప లక్షల్లో పలుకుతుందండీ…! అలాంటి ఈ చేప తాజాగా అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని అంతర్వేది సముద్ర తీరంలో కృష్ణా జిల్లా మత్స్యకారులకు చిక్కింది. 2 చేపలు వలలో పడ్డాయి.. ఇంకేముంది.. వెంటనే వాటిని కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం మినీ ఫిషింగ్‌ హార్బర్‌లో వేలం వేశారు. వీటిని కొనేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. ఫైనల్‌ గా ఓ వ్యాపారి రెండు చేపలకు రూ.4 లక్షలు చెల్లించి కొనుగోలు చేశాడు.

స్పెషల్స్‌ ఏమిటంటే …?
సముద్రంతో దొరికే ఈ కచ్చిడి చేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్‌ బ్లాడర్‌తో నుంచి తయారు చేస్తారు. కాస్లీ వైన్స్‌లో కూడా ఈ చేపను వేయడంతో ఆ వైన్‌ ధర.. ఎక్కువగా పలుకుతుందని ఈ చేప గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఈ చేపల్లో ఉండే తెల్లటి బ్లాడర్‌(మావ్‌)ను ఔషధాలకు పొరలా, శస్త్రచికిత్సలో కుట్లు వేసే దారంలా వాడతారని.. అందుకే వీటికి భారీ డిమాండ్‌ ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. ఈ చేపల పొట్ట భాగంలో ఉండే అవయవాలకు ఔషద గుణాలుంటాయని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు … ఈ చేపల పొట్టభాగాన్ని బలానికి వాడే మందుల్లో వినియోగిస్తారట. ఇలాంటి చేపలు అరుదుగా మత్సకారుల వలలో పడుతాయని అలాంటప్పుడు వారి పంట పండినట్టే అని అంటున్నారు. వీటిని కొనుగోలు చేసే వారు తినడానికన్నా.. వాటితో వ్యాపారం చేయడానికే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ఈ కచ్చడీ చేపలు చాలా అరుదుగా మాత్రమే జాలర్లకు చిక్కుతుంటాయి. సముద్రపు అడుగు భాగంలో ఎక్కువగా సంచరిస్తుంటాయి.

➡️