ప్రజాశక్తి-విజయనగరం : పట్టణ ప్రాంతాల్లో ఓటుహక్కు వినియోగించుకుంటున్న వారి శాతం తక్కువగా ఉంటోందని, దీంతో పాటు యువత కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదని, వీరంతా వచ్చే సాధారణ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ముందుకు వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ విజ్ఞప్తి చేశారు. నగరంలోని యువఓటర్లు, పట్టణ ప్రజలకు ఓటుహక్కు వినియోగించు కోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించే నిమిత్తం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం 2కె రన్ నిర్వహించారు. స్థానిక కోట జంక్షన్ నుంచి ప్రారంభమై రాజీవ్ స్టేడియం వరకు జరిగిన పరుగులో జెసితో పాటు ట్రైనీ సహాయ కలెక్టర్ బి.సహాదిత్ వెంకట్ త్రివినాగ్, మున్సిపల్ కమిషనర్ ఎం.ఎం.నాయుడు, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, డిఎస్డిఒ వెంకటేశ్వరరావు, నెహ్రూయువ కేంద్రం అధికారి ఉజ్వల్, నగర యువత, ఎన్సిసి. క్యాడెట్లు క్రీడాకారులు ఈ పరుగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా ఓటరుగా నమోదైన యువత ఓటు విలువ తెలుసుకొని దానిని వినియోగించుకోవడం ద్వారా దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/rally-5.jpg)