ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్ స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికే ఓటు వేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కోరారు. ఉక్కు రక్షణ కోసం పనిచేసే వారికే కార్మికవర్గమంతా ఓటు వేయనుందని తెలిపారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 1167వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్ కోకో ఓవెన్ విభాగం కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ నాయకులు యు.రామస్వామి, డి.ఆదినారాయణ, టివికె.రాజు, శ్రీనివాసులు నాయుడు, శ్రీనివాస్, ఆనంద్, మొహిద్దిన్ మాట్లాడారు. విశాఖ ఉక్కు వ్యూహాత్మక అమ్మకంపై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు పొందేందుకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు చూస్తున్నాయని విమర్శించారు. ప్రజలు వీటన్నింటినీ గుర్తించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీలకే ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.