శ్రీనగర్ (జమ్ము కాశ్మీర్) : ఉత్తర కాశ్మీర్ బండిపోరా జిల్లాలోని ఆరాగం ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల్లో గుర్తు తెలియని ఉగ్రవాది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆరాగం ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నట్లు సమాచారం అందటంతో భద్రత బలగాలు అక్కడికి చేరుకొని కాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మరణించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాది మృతదేహాన్ని డ్రోన్ సాయంతో గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు.. జమ్ము కాశ్మీర్లోని పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో సమావేశం జరిగింది. కాశ్మీర్లో చెలరేగుతున్న ఉగ్రవాదం ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను అమిత్ షా ఆదేశించారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో చోటు చేసుకుంటున్న ఉగ్రవాద దాడుల పరిస్థితులను పరిశీలించడానికి సోమవారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్ అక్కడ పర్యటించనున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/kashmir.jpg)