రికార్డులను పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్ నూరుల్ కమర్
ప్రజాశక్తి – కొత్తూరు
దేవాదాయ శాఖకు చెందిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయ భూమిలో అక్రమ నిర్మాణంపై టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్మాణాన్ని నిలిపివేయించాలని అధికారులను ఆదేశించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు మండలంలోని కర్లెమ్మ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు 177, 202-2, 202-5లో భూములను బుధవారం పరిశీలించారు. దేవాదాయశాఖకు చెందిన స్థలంలో అక్రమ నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సర్వే నంబరు 202-2లో కొవ్వాడ గోపాల్ దేవాదాయ భూమి 60 సెంట్లను ఆక్రమించినట్లు గుర్తించారు. తన ఐదు సెంట్ల భూమిని గోపాల్ ఆక్రమించారని పొందూరు సరస్వతి సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంట తహశీల్దార్ ఎం.వి ప్రసాద్, డిప్యూటీ తహశీల్దార్ సత్యనారాయణ, మండల సర్వేయర్ వెంకటరమణ, సర్వేయర్లు గిరిరాజు, ఎ.తిరుపతిరావు, విఆర్ఒలు ఉన్నారు.