శ్రీధర్ను సన్మానం చేస్తున్న కూటమి నాయకులు
పలాస:
రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఏర్పాటుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసే కృషి ఎనలేనిదని జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. పలాస రైల్వే ఇన్స్టిట్యూట్లో జనసేన మండల నాయకులు అట్టాడ వాసు అధ్యక్షతన ఆదివారం విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి బలంతో కేంద్ర పౌర విమాయనా శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు 3.50 లక్షలు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష 40 వేలు పైబడి మెజారిటీతో గెలుపొందారన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులుగా ఉండడంతో జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఐక్యమంగా విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే కూటమి నాయకులు కలిసి కట్టుగా పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించాలన్నారు. ఎమ్మెల్యే గౌతు శిరీష బాధ్యతగా భావిస్తూ ప్రజలకు సేవలు అందించేందుకు గ్రామాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో పంట భూములకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. అనంతరం ఆయనకు కూటమి నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు బి.నాగరాజు, డొక్కరి శంకర్, టంకాల రవి శంకర్గుప్తా, సప్ప నవీన్, జనసేన నాయకులు దేవ, అశోక్, రాము, కేదార్, మోహన్, కార్తిక్, చిన్ని, చైతన్య, పృథ్వి, సంతోష్, గోపాలరావు, నీలకంఠం, సందీప్, గీతా గణపతి, ఈశ్వరరావు, తేజ, రాజు, మిన్నారావు పాల్గొన్నారు.