ప్రజాశక్తి-సాలూరు: ఒడిశా నుంచి అక్రమంగా పశువుల ను తరలిస్తున్న లారీ బుధవారం పట్టణంలో బైపాస్ రోడ్డులో బోల్తా పడింది. దీంతో పది ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఒడిశాలోని సిమిలిగూడ నుంచి మానాపురం సంతకు కంటెయినర్ లారీలో 40 పశువులను రవాణా చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. క్లీనర్ ఫిర్యాదు మేరకు టౌన్ సిఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. కంటెయినర్ లారీలో పైన, కింద రెండు వరుసల్లో పశువులను కిక్కిరిసినట్లు పెట్టి తరలిస్తుండగా ప్రమాదం సంభవించింది. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ 1960 కింద కేసు నమోదు చేశామని, డ్రైవర్ పరారీలో ఉన్నాడని సిఐ శ్రీనివాసరావు చెప్పారు.