ప్రజాశక్తి – గరుగుబిల్లి : మండలంలోని తోటపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. శనివారం ఆమె తోటపల్లి వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తోటపల్లి దేవస్థానాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రస్తుతం ఆలయంలో నిర్మిస్తున్న పలు అభివృద్ధి పనులు పూర్తయ్యేలా నిధుల మంజూరుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి వివి సూర్య నారాయణ, స్థానిక సర్పంచ్ ఆవాల సింహాచలం, టిడిపి నాయకులు, మర్రాపు పురు షోత్తంనాయుడు, అక్కేన మధుసూదనరావు, అంబటి తవిటి నాయుడు (రాంబాబు), కోట భరత్కుమార్ (సుమన్), మరడాన సింహాచలంనాయుడు, ముదిలిబాబు విజయ వాంకుశం, డొంకాడ రామకృష్ణ, ఆర్నిపల్లి గంగాధరనాయుడు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.మైనింగ్ సమస్య పరిష్కరించాలిమండలంలోని చినగుడబలో నిర్వహిస్తున్న మైనింగ్ సమస్య పరిష్కరించాలని జనసేన ఇంచార్జ్ కడ్రక మల్లేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిని కోరారు. గ్రామ సమీపాన మైనింగ్ నిర్వహిస్తున్నందున కాలుష్యంతో పాటు పొలాలకు నష్టం జరుగుతుందని వివరించారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ మైనింగ్ సమస్య గురించి తనకు తెలుసునని, దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మూడు గ్రామాలకు సంబంధించి రైతులు, పలువురు జనసేన, టిడిపి నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.ఎమ్మెల్యేను సన్మానించిన ఆదివాసీ జెఎసి గుమ్మలక్ష్మీపురం : కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిని ఆదివాసీ జెఎసి జిల్లా చైర్మన్, సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నిత్యం ఆదివాసీల సమస్యలపై స్పందించి ఆదివాసీల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. అలాగే మరికొన్ని సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్లో ఆదివాసీలకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ జెఎసి చైర్మన్ కొండగొర్రి ధర్మారావు, వైస్ చైర్మన్ రోబ్బ లోవరాజు, దుక్క సీతారాం, ఇంటికుప్పల రామకృష్ణ, కోలక గౌరమ్మ, మల్లయ్య, ఉన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/kpm-mla.jpg)