ఎమ్మెల్యే ఆదిమూలంది రాజకీయ ఆత్మహత్యమీడియాతో మంత్రులు ఆర్కే రోజా, పెద్దిరెడ్డిప్రజాశక్తి – తిరుపతి సిటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాలుగో కష్ణుడిగా కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల ప్రవేశించారని రాష్ట్ర మంత్రులు ఆర్కే రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. తిరుపతిలోని ఓ హౌటల్లో సోమవారం మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా షర్మిలాను అభిమానులు గౌరవిస్తారని, కానీ కుటుంబాన్ని చీల్చిన పార్టీతో, రాష్ట్ర విభజనతో ఆంధ్ర ప్రదేశ్ ను అధోగతి పాలుచేసిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం శోచనీయమన్నారు. తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన కాంగ్రెస్ పార్టీతో వైయస్ షర్మిల జతకట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ చంద్రబాబు కుయుక్తులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంతా తెలుసన్నారు. తనకు మళ్ళీ ఛాన్స్ కావాలని ప్రజల్లోకి వస్తున్నారని, రాబోవు ఎన్నికల్లో గతంలో వచ్చిన 23 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం రాజకీయంగా తనకు అన్ని విధాలా సహకరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేస్తూ, వైఎస్ఆర్సి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ తనకు తానే రాజకీయ ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాబోవు ఎన్నికల వైఎస్ఆర్సిపి క్లీన్ స్వీప్ చేస్తుందని, జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.