ప్రజాశక్తి-సీతంపేట : ప్రశాంతంగా ఎన్నికలకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సహకారం ఉండాలని, దీనిలో భాగంగా వాస్తవ వార్తలను మాత్రమే ప్రచురించాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి సూచించారు. బుధవారం పాలకొండ నియోజకవర్గంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, కరపత్రాలు ముద్రిస్తే అభ్యర్థి పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. పాలకొండ నియోజకవర్గంలోని 287 పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు అవసరమయ్యే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పాలకొండ జూనియర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. గ్రామాల్లో ఇవిఎం యంత్రం ద్వారా ఓటింగ్పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.