ముంబయి : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచింది. గరిష్ఠంగా రూ.75 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయని ఎస్బిఐ తన వెబ్సైట్లో ఖాతాదారులకు స్పష్టం చేసింది. ప్రస్తుతం క్లాసిక్, గ్లోబల్, కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డులపై బ్యాంకు జిఎస్టి మినహా రూ.125 వసూలు చేస్తోండగా.. దీన్ని రూ.200కు పెంచింది. యువ, గోల్డ్, కాంబో కార్డులపై ఇప్పుడు రూ.175 ఛార్జీ ఉండగా.. దాన్ని రూ.250కు చేర్చింది. అలాగే ప్లాటినం డెబిట్ కార్డు ఛార్జీని రూ.250 నుంచి రూ.325కు సవరించింది. ప్రైడ్, ప్రీమియం బిజినెస్ కార్డుపై ప్రస్తుతం రూ.350 చార్జ్ ఉండగా.. దాన్ని రూ.425కు చేర్చింది.