2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు
ముంబయి : ఎయిరిండియా ఎక్స్ప్రెస్ తమ విమాన సేవలను క్రమంగా పునరుద్ధరిస్తోంది. రద్దయిన విమానాల సంఖ్య ఆదివారం నాటికి 20కి తగ్గింది. అనారోగ్య సెలవులపై వెళ్లి.. తమ నిరసన వ్యక్తం చేసిన క్యాబిన్ సిబ్బంది మొత్తం విధుల్లో చేరినట్లు కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు. మంగళవారం నాటికి పూర్తిస్థాయిలో విమానాలు నడుస్తాయని తెలిపారు.
కంపెనీలో నిర్వహణ లోపాలు, కొంతమంది సిబ్బందిపై వివక్షను నిరసిస్తూ క్యాబిన్ సిబ్బందిలో దాదాపు 300 మంది సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో గతవారంలో చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి. అప్రమత్తమైన సంస్థ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వారితో సంప్రదింపులు జరపడంతోపాటు విధుల్లో చేరకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. సెలవుపై వెళ్లిన సిబ్బంది ఈ నెల 11 నాటికి పూర్తిగా విధుల్లో చేరారని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ వెల్లడించింది. కంపెనీ షెడ్యూలింగ్ సాఫ్ట్వేర్లో లోపాల కారణంగా ఇంకా కొంత మంది సెలవుపై ఉన్నట్లు చూపిస్తోందని తెలిపింది.