ఫొటో : సమ్మెలో మాట్లాడుతున్న సిఐటియు నాయకులు కాకు వెంకటయ్య
అంగన్వాడీలు, సిఐటియు నాయకులు అరెస్ట్లు సరికాదు..
ప్రజాశక్తి-ఉదయగిరి : పాదయాత్రలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీల కోసం సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టే సమ్మెకు సహకరించే సిఐటియు జిల్లా నాయకులను అరెస్టు చేయడం జగన్ ప్రభుత్వానికి సరికాదని ఉదయగిరి సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు విమర్శించారు. శనివారం 18వ రోజు సమ్మెలో సిఐటియు నాయకులు కాకు వెంకటయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టే సమ్మెలో సిఐటియు నాయకులను అరెస్టు చేయడం బాధాకరమని, ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే అరెస్టులు చేయడం జగన్ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. అంగన్వాడీలకిచ్చిన హామీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, వారికి న్యాయం చేసి, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలన్నారు. మూడు రోజులు క్రితం ఉదయగిరిలో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు నాయకులు చేపట్టే సమ్మెను అడ్డుకున్నారని ఇలాంటి భయంకర వాతావరణాన్ని తీసుకురావడం ప్రభుత్వానికి మంచిది కాదని అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పార్లమెంటులో చర్చించి వారికి రూ.26వేల వేతనం అమలుచేసి సుప్రీంకోర్టు జిఒ ప్రకారం గ్రాడ్యుటీని అందించాలన్నారు. ఇలాంటి అక్రమ అరెస్టుపై సమ్మె మరింత ఉధృతమవుతుందని అంగన్వాడీలు సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకూ సమ్మెను కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు ప్రమీల, చాంద్ బేగం, రమాదేవి, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.