ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం ఒకటవ డివిజన్ పరిధి అయ్యప్పనగర్లో పూసర్ల మధు సూధనరావు అక్రమంగా నడుపుతున్న స్వాతీ ప్యూరి పైడ్ కూలింగ్ వాటర్ ప్లాంట్ను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్చేస్తూ పట్టణపౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యాన శనివారం ఆర్డిఒ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకరరావు, అయ్యప్ప నగర్ పోరాట కన్వీనర్ యుఎస్ రవికుమార్ మాట్లాడుతూ ఈ వాటర్ప్లాంట్కు భూగర్భ జల శాఖ అధికారులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఎవరూ అనుమతులు ఇవ్వలేదని, అయినా అక్రమంగా నీటి వ్యాపారం చేస్తూ ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారని తెలిపారు. మరో వైపు అయ్యప్పనగర్ లో ప్రజలు, సొంత ఇంటిదార్లు తమ ఇళ్లల్లో బోర్లు ఇంకిపోయి నీరు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కావున తక్షణమే అక్రమ వాటర్ ప్లాంట్ సీజ్ చేసి, ప్రభుత్వాన్ని మోసం చేసి అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్న యజమాని పూసర్ల మధుసూదన రావును ఆరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, ఎల్బిజి నగర్ కార్యదర్శి బి.రమణ, గురజాడ నగర్ కార్యదర్శి రంబ శ్రీను, అయ్యప్పనగర్ కాలనీ అసోసియేషన్ కార్యదర్శి సుదీర్, పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు కంది త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.