ప్రజాశక్తి-ఉక్కునగరం : ఉక్కు కాంట్రాక్టు కార్మికుల జీతాలు సకాలంలో చెల్లించాలని అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల నేతలు కోరారు. శుక్రవారం సిజిఎం (హెచ్ఆర్)గాంధీకి వినతిపత్రాన్ని అందించారు. ఈసందర్భంగా కాంట్రాక్టు లేబర్ యూనియన్, సిఐటియు ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ మాట్లాడుతూ. ఉక్కు యాజమాన్యం చొరవ తీసుకుని కాంట్రాక్టు కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. స్టీల్ ఉత్పత్తి, ప్లాంట్ నిర్వహణలో రెగ్యులర్ ఉద్యోగులతోపాటు కీలకంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టు కార్మికుల పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని, యాజమాన్యం స్పందించి తక్షణమే వేతనాలను చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు. జి శ్రీనివాసరావు, చట్టి నర్సింగరావు, వంశీ, నాగరాజు, సత్యారావు, సిహెచ్ రమణ పాల్గొన్నారు
సిజిఎమ్కు వినతిపత్రం ఇస్తున్న ఉక్కుకాంట్రాక్టు కార్మికులు