గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనను పొరపాట్లు లేకుండా పగడ్బందీగా ఈ నెల 28నాటికి పూర్తి చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి వార్డు సచివాలయ కార్యదర్శులు, నోడల్ అధికారులను ఆదేశించారు. గుంటూరు నగరంలో శుక్రవారం నుండి ప్రారంభమైన కుల గణనపై కమిషనర్ సచివాలయ కార్యదర్శులు, నోడల్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్టంలో కుల గణన చేపట్టాలని ఈ నెల 19 నుండి 28 వరకు షెడ్యుల్ ఇచ్చిందని, అందుకు తగిన విధంగా గుంటూరు నగరంలో కూడా కుల గణన నిర్దేశిత గడువు మేరకు పూర్తి చేయడానికి సచివాలయం వారిగా కార్యాచరణ సిద్దం చేయాలని నోడల్ అధికారులను ఆదేశించారు. వాలంటీర్లు అందరూ సర్వేలో విధిగా పాల్గొనాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారి పై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సర్వేలో సేకరించిన ప్రజల సమాచారం గోప్యంగా ఉంచాలన్నారు. ప్రస్తుతం సర్వే జరిగే కాలంలో ఎవరైనా ప్రజలు అందుబాటులో లేకుంటే వారు 28 తర్వాత తమ వార్డ్ సచివాలయంలో నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. తమ ఇంటి వద్దకు వచ్చే వాలంటీర్లకు ప్రజలు తగిన సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/2-39.jpg)