ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్: పట్టణంలో గల గాయత్రీ స్కూల్లో సోమవారం పాఠశాల కరస్పాండెంట్ పీవీకే మణికుమార్, ఆయన భార్య సరిత ఆధ్వర్యంలో విద్యార్థులతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాలకు విద్యార్థిని, విద్యార్థులు తెలుగు సాంప్రదాయ దుస్తులను ధరించి హాజరయ్యారు. విద్యార్థిని, విద్యార్థులు హరిదాసు వేషధారణలు, భోగి మంటలు, గంగిరెద్దుల ఆటపాటలు, నృత్యాలు పలువుర్ని ఆకట్టుకున్నాయి. అనంతరం స్కూల్ కరస్పాండెంట్ భోగి, సంక్రాంతి, కనుమ విశిష్టతను విద్యార్థిని, విద్యార్థులకు తెలియజేస్తూ ఆచార సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బలిజిపేట : మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని శ్రీ భారతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో భోగి మంటలు వెలిగించి సంక్రాంతి ముందస్తు వేడుకను జరుపుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆటల పాటలతో అలరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు, పంపిణీ చేశారు. విజేతలకు బహుమతులు అందజేసి విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. కార్యక్రమంలో ఎంఇఒలు సింహాచలం, శ్రీనివాస్, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.జయప్రసాద్, బూరాడ జగన్, శ్రీనివాసరావు అజరు ప్రసాద్, తదితరులుపాల్గొన్నారు. తమ్మినాయుడు విద్యా సంస్థల్లో…పాలకొండ : పట్టణంలోని స్థానిక తమ్మినాయుడు విద్యాసంస్థల ప్రాంగణంలో వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో తమ్మినాయుడు విద్యాసంస్థల ప్రెసిడెంట్ ఎస్.నారాయణమ్మ, స్కూల్ ప్రిన్సిపల్ బి.కుమార్, కాలేజ్ ప్రిన్సిపల్ ఎ.తిరుపతి రావు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.