విద్యార్థులకు స్కాలర్షిప్లు అందచేస్తున్న సినీ యాక్టర్ గోపిచంద్ తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు : జీవితంలో విద్యార్థి దశ ఎన్నో మధుర జ్ఞాపకాలను నింపు తుందని, అందుకు తగ్గట్టు తమ విలువైన సమయాన్ని ఉన్నత స్థాయికి చేరే లక్ష్యంతో సరైన ప్రణా ళికను రూపొందించు కోవాలని ప్రముఖ సినీ నటులు తొట్టెంపూడి గోపీచంద్ పేర్కొన్నారు. శనివారం ఆర్విఆర్ అండ్ జెసి ఇంజినీరింగ్ కాలేజి 39వ వార్షికోత్సవ వేడుకలకు గోపిచంద్, ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ ఎడ్వైజర్ ప్రొఫెసర్ వజ్జా సాంబశివరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత కళాశాల ప్రాంగణంలోని రాయపాటి వెంకట రంగారావు, జాగర్లమూడి చంద్రమౌళి విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం కళాశాలలో అర్హులైన 277 మంది విద్యార్థులకు రూ.20 వేల చొప్పున రూ. 55 లక్షల 40 వేలు స్కాలర్షిప్లు, వివిధ కోర్సులలో ఉత్తమ ఫలితాలు సాధించిన 19 మంది విద్యార్థులకు ఎండోమెంట్ క్యాష్ అవార్డులు అతిథుల చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్షులు రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ 2006 – 2007 విద్యా సంవత్సరం నుండి ఇప్పటి వరకు 2,099 మంది విద్యార్థులకు దాదాపు రూ.3.53 కోట్లు పైగా నగదు స్కాలర్ షిప్ అందజేసినట్లు పేర్కొన్నారు.ప్రొఫెసర్ వజ్జా సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ ఆవిష్కరణలను చేస్తూ అంకుమపరిశ్రమల స్థాపనల దిశగా పయనించాలన్నారు. అనంతరం జానపద, సాంస్కృతిక, నృత్యనాట్య ప్రదర్శన, వివిధ రకాల ఆటలు, గ్రామీణ వాతావరణాన్ని తలపించే స్టాల్స్, చేతి కళాకతులచే తయారు చేసిన ఆటబొమ్మల స్టాల్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం అతిథులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ , ట్రెజరర్ డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్, వైస్- ప్రెసిడెంట్ జాగర్లమూడి మురళి మోహన్, కళాశాల పాలకమండలి సభ్యులు గద్దె మంగయ్య, పి. గోపి చంద్, కె.రంగారావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు.