ప్రజాశక్తి – యానాంయానాం జవహర్ నవోదయ విద్యాలయలో చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ప్రిన్సిపల్ టివిఎస్.ప్రకాశరావు అధ్యక్షతన ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు. 1988 నుంచి చదువుకున్న సుమారు 120 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. వారితో ప్రిన్సిపల్ ప్రకాశరావు మాట్లాడుతూ వివిధ రంగాల్లో విద్యార్థులు సాధించిన ప్రగతిని వివరించారు. నేటి యువత తన శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. విద్యార్థుల రాకతో విద్యాలయలో పండగ వాతావరణం కనిపించిందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఐ లవ్ యు జెఎన్వి సెల్ఫీ సైన్ బోర్డును ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు తాము సాధించిన విజయాలను మిగతా విద్యార్థులతో పంచుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాలయ వైస్ ప్రిన్సిపల్ ఎస్కె.బేగం, విశ్రాంతి తెలుగు ఉపాధ్యాయులు ఆర్వి.శర్మ పాల్గొన్నారు.