ప్రజలు పునరాలోచించాలి

ప్రజాశక్తి – భీమవరం/ఆచంట

‘చల్లని సాయంత్రం, ఆహ్లాదకరమైన వాతావరణం.. ఎటు చూసినా పచ్చని పొలాలు దేశానికి అన్నంపెట్టిన అన్నపూర్ణ పశ్చిమగోదావరి జిల్లా అని, ఈ జిల్లా అంటే తనకు ఎనలేని అభిమానమని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. 2014 ఎన్నికల్లో 15 అసెంబ్లీ, మూడు పార్లమెంట్‌ స్థానాలు టిడిపికి ఇచ్చారని, రానున్న ఎన్నికల్లో టిడిపికి పూర్వ వైభవాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు పశ్చిమ ప్రజలు పునరాలోచించాలని కోరారు. నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఆచంటలో నక్కల కాలువ సమీపాన టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అధ్యక్షతన ‘రా.. కదలిరా’ బహిరంగ సభను ఆదివారం సాయంత్రం నిర్వహించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వెనుక ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చంద్రబాబు సాయంత్రం 4.05 గంటలకు హెలీకాప్టర్‌లో చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వారులో రోడ్డు మార్గాన బయలుదేరారు. రామేశ్వరస్వామిని దర్శించుకుని సభా ప్రాంగణానికి 5.19 నిమిషాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పితాని సత్యనారాయణ అధ్యక్షత వహించగా చంద్రబాబు మాట్లాడారు. మంచికి, అతిథి మర్యాదలకు మారు పేరు పశ్చిమ జిల్లా అని అన్నారు. ఆచంట నుంచే జై విజయయాత్ర ప్రారంభిస్తున్నామని చెప్పారు. టిడిపియే కాకుండా జనసేన అంటే కూడా ఈ జిల్లాలో అభిమానం ఎంతో ఉందన్నారు. వైసిపి సినిమా అయిపోయిందని, త్వరలో వారంతా బయటకు పోతారన్నారు. జిల్లాలో ఏ ఒక్క రోడ్డూ నిర్మించలేదని, కాలువలు, డ్రెయినేజీల పూడిక తీయలేదన్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేశారని విమర్శించారు. వరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. రైతులకు, కౌలు రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ధాన్యం కొనుగోలుకు కనీసం గోనె సంచులు కూడా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వమని విమర్శించారు. దిక్కుతోచని స్థితిలో రైతులు క్రాప్‌ హాలీడే ప్రకటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే రైతు రాజ్యం తీసుకొస్తామన్నారు. పోలవరాన్ని పూర్తి చేసి నదులను అనుసంధానం చేసి మూడు పంటలకు నీరు అందిస్తామన్నారు. వరి రైతులు, కౌలు రైతులు, అన్ని వర్గాల ప్రజలు 90 రోజులు కష్టపడితే స్వర్ణయుగం తీసుకొస్తానని చెప్పారు. జిల్లాలో అసమర్థ మంత్రులు, ఎంఎల్‌ఎలు జిల్లాలో వైసిపికి చెందిన మంత్రులు, ఎంఎల్‌ఎలు అసమర్థులని, వారి సొంత ప్రయోజనాలు తప్ప ప్రజల కష్టాలు పట్టవని చంద్రబాబు విమర్శించారు. తణుకులో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారని, సొంత జిల్లాలోనే రైతులకు ధాన్యం కొనుగోలుకు గోనె సంచులు ఇవ్వని అసమర్థ మంత్రి అన్నారు. రాష్ట్రంలోని టిడిఆర్‌ బాండ్ల కుంభకోణం తణుకు నుంచే జరిగిందని, దీనిని రాష్ట్రమంతా వైసిపి అమలు చేస్తుందన్నారు. నియోజకవర్గంలో ఏది నిర్మించాలన్నా ఐదు శాతం కమీషన్‌ ఇవ్వాలని ఆ మంత్రి నిబంధన విధించారన్నారు. తాడేపల్లిగూడేనికి చెందిన మరొక మంత్రి కొట్టు సత్యనారాయణ ఏకంగా చిల్లర కొట్టే పెట్టారన్నారు. అన్నిచోట్లా అక్రమ వసూళ్లకు పాల్పడుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. సభలో జనసేన జిల్లా అధ్యక్షులు గోవిందరావు, నేతలు బొమ్మిడి నాయకర్‌, జుత్తిగ నాగరాజు, చేగొండి సూర్యప్రకాష్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌, విడివాడ రామచంద్రరావు పాల్గొన్నారు.

➡️