ప్రజాశక్తి – కలెక్టరేట్: జిల్లాలో పనిచేస్తున్న సవర భాష వాలంటీర్లకు గత నాలుగు నెలల నుండి జీతాలు లేక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున తక్షణమే వేతనాలు చెల్లించాలని సవర భాష వాలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షులు బి.వెంకటేష్, ఉపాధ్యక్షులు బి.భీమారావు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఐటిడిఎ వద్ద నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడుతూ స్థానిక ఐటిడిఎ పరిధిలో గల 176 పాఠశాలల్లోనూ, సీతంపేట ఐటిడిఎ పరిధిలో గల 155 పాఠశాలలో సవర భాష ఉపాధ్యా యులుగా పని చేస్తున్న వారందరికీ ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు పాఠశాల విధులకు తీసుకున్నారన్నారు. గౌరవ వేతనంగా ఇస్తున్న రూ.5వేలు కూడా సకాలంలో ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర వేతనంతో కుటుంబ పోషణ చాలీచాలని పరిస్థితిలో ఉన్నామని, కావున ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి తక్షణమే బకాయి పడ్డ జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అలాగే కనీస గౌరవ వేతనం పెంపుదల చేయాలని, ఎంటిబి, ఎంఎల్ఇలకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ను ప్రభుత్వమే కల్పించాలని, సవర భాష వాలంటీర్లకు మార్చి, ఏప్రిల్ నెలలు కూడా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సవర భాష వాలంటీర్లు మోహన్ రావు, గంగారావు, గోవిందరావు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/savra.jpg)