- విఎంసి వద్ద పంప్ హౌస్ పథకం కార్మికుల ఆకలి దీక్ష
ప్రజాశక్తి-విజయనగరం టౌన్: విజయనగరం కార్పొరేషన్ ప్రజానీకానికి త్రాగునీరు అందిస్తున్న ముసిడి పల్లి , రామతీర్థం నెల్లిమర్ల మాస్టర్ పంపు హౌస్ కార్మికులకు 2023 నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి జీతాలు రావాల్సి ఉందని వెంటనే ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ డ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సీఐటీయూ) నాయకులు జగన్మోహన్, మురళి, అరుణ్ నారాయణరావు, చందర్రావులు డిమాండ్ చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆకలి దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్చి 16న గౌరవ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చల్లో మార్చి 18 సోమవారం మధ్యాహ్నం నాటికి 2000/- బకాయి జీతంతో పాటు , అమత పంపు హౌస్ కార్మికులకు సెప్టెంబర్ నెల బకాయి జీతం చెల్లిస్తామని నెలాఖరికి జీతాలు చెల్లిస్తామని కాంట్రాక్ట్రర్ హామీ ఇచ్చారని నేటికి డబ్బులు చెల్లించలేదని నెలలు తరబడి జీతాలు ఇవ్వకుంటే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. అమత పంప్ హౌస్ కార్మికులకు 2022 మార్చి, ఏప్రిల్ జీతం బిల్లులు కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ధర్నా చేస్తామంటే నిన్న 70 మందికి 2000/-చొప్పున అకౌంట్లో వేశారని తెలిపారు. 2023 జూలై నుంచి ప్రభుత్వం వద్ద బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, అవి వస్తే తప్ప జీతాలు చెల్లించలేమని కాంట్రాక్టర్ చేతులెత్తేస్తున్నారని తెలిపారు.,7 నెలలు గా జీతాలు లేక కుటుంబాలతో ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వం, పాలకవర్గం ఇప్పటికైనా స్పందించి బకాయి జీతాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరవధిక నిరసన దీక్షలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం బకాయి జీతాలు పై కమిషనర్ ఎం . ఎం. నాయుడు తో చర్చించారు. కాంట్రాక్టర్ తో మాట్లాడి జీతాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని చెప్పడంతో ఆందోళన విరమించామన్నారు. కార్యక్రమంలో నెల్లిమర్ల, ముసిడిపల్లి, రామతీర్థం పంప హౌస్ కార్మికులు పాల్గొన్నారు.