భానుడు భగ..భగ

Mar 28,2024 21:33

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  జిల్లాలో భానుడు భగభగ లాడుతున్నాడు. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అత్యధికంగా 36 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మార్చి నెల ముగుస్తుందటంతో వేసవి తాపానికి ప్రజలు అల్లాడుతున్నారు. ఎండను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి భగభగలాడుతున్న సూర్యుడు మార్చి ఆరంభం నాటికి తన ప్రతాపాన్ని పెంశాడు. వారం రోజుల నుంచి ఎండ తీవ్రరూపం దాల్చింది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జిల్లాలో గతేడాది ఇదే సమయానికి పగటి పూట అత్యధికంగా 38 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కాగా ఈ ఏడాది కూడా 38 డిగ్రీలకు చేరుకుంది. విజయనగరంలో గురువారం అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 37 డిగ్రీలు, 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రత వల్ల ఎండ సెగ తీవ్ర స్థాయిలో కనిపించింది. ఎండ ధాటికి తట్టుకోలేక నగరంలో మధ్యాహ్నం పూట రోడ్ల మీద జన సంచారం పలుచబడింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ రోడ్ల మీద జనం చాలా తక్కువగా కనిపించారు. అత్యవసర పనుల విషయంలో మినహాయించి మిగతా సందర్భాల్లో రోడ్ల మీదకు వచ్చేందుకు జనం వెనుకాడుతున్న పరిస్థితి ఏర్పడింది. నగరంలోని కోట కూడలి, కలెక్టరేట్‌, గంటస్తంభం, ఆర్టీసి కాంప్లెక్స్‌, మూడు లాంతర్లు ప్రాంతాలు మధ్యాహ్నం నిర్మానుష్యంగా కనిపించాయి. అవసరమై రోడ్ల మీద తిరిగేవారు ఎక్కువగా చెట్ల, షాపులు కింద నీడను ఆశ్రయిస్తూ కనిపించారు. ఎక్కువ ప్రమాదం ఎవరికంటే..ఎండ సమయంలో బయట ఎక్కువగా తిరగడం వల్ల పిల్లల్లో ఎక్కువగా వడదెబ్బ తగిలే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, క్రీడాకారులు, బాలింతలపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీర్ఘకాలక వ్యాధులు, స్థూలకాయం ఉన్నవారు, మద్యం ఎక్కువగా తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.జాగ్రత్తలు తప్పవంటున్న నిపుణులుప్రజలు బయట తిరిగే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.వడదెబ్బ వంటివి తగలకుండా నీటిని ఎక్కువగా తీసుకుంటూ సాధ్యమైనంత వరకూ నీడలో ఉండాలని సూచిస్తున్నారు. వడదెబ్బతగిలిన తరువాత మళ్లీ ఎండలోకి వెళ్లకూడదని, చల్లని నీడలో విశ్రాంతి తీసుకోవాలని అంటున్నారు. బయట తిరిగే సమయంలో తలకు టోపీపెట్టుకోవాలని, గొడుగు వాడాలని, రోజుకు ఐదు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలని, సమయానికి ఆహారం తీసుకోవాలని, ఉప్పు కలిపిన ద్రవాలు తాగాలని, శరీరంలో నీటి శాతాన్ని పెంచుకునేందుకు పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు తాగాలని, వదులైన కాటన్‌ దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.

➡️