ప్రజాశక్తి-గజపతినగరం : మన్యం జిల్లా సాలూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి మంగళవారం గజపతినగరంలో ఘన స్వాగతం లభించింది. నియోజకవర్గ టిడిపి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగు మహిళలు స్థానిక జాతీయ రహదారిపై భువనేశ్వరికి స్వాగతం పలికారు. దీంతో ఆమె కారు దిగి కాసేపు వారితో ముచ్చటించారు. అభ్యర్థి శ్రీనివాస్, మాజీ ఎంపిపి కొండపల్లి కొండలరావు, మహిళా విభాగం నాయకురాలు మాజీ ఎంపిపి గంట్యాడ శ్రీదేవి తదితరులతో కొద్దిసేపు ముచ్చటించారు. పార్టీ విషయాలు అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసు విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ వైస్ ఎంపిపి బొడ్డు రాము, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చప్ప చంద్రశేఖర్ , సర్పంచ్ జానకిరాం తదితరులు ఉన్నారు.