ప్రజాశక్తి – కాకినాడ
జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో 13 మంది విద్యార్థులకు, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకంలో ఆరుగురు విద్యార్థులకు నిధులను విడుదల చేసినట్లు కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. బుధ వారం తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాల్లోకి సిఎం జగన్ నిధులను విడుదల చేశారు. కలెక్టరేట్ నుంచి ఎంఎల్సి కర్రి పద్మశ్రీ, పెరికి కార్పొరేషన్ ఛైర్మన్ గంగాభవానిలతో కలిసి కలెక్టర్ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద 13 మంది విద్యార్థులకు రూ.1,33,15,904 విడుదల చేశామని, అలాగే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకంనకు సంబంధించి ఆరు గురు విద్యార్థులకు రూ.6.50 లక్షలను విడుదల చేసినట్లు తెలిపారు. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం మొదలైన 21 ఫ్యాకల్టీలలో టాప్-50 ర్యాంకుల్లో ఉన్న కళాశాలల్లో ప్రవేశం పొందిన ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్థులకు రూ.1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ విమాన ప్రయాణం, వీసా ఖర్చులతో సహా దీనిద్వారా ప్రపంచంలోని టాప్ 320కి పైగా అత్యుత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కల్పించిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ జెడి డివి.రమణమూర్తి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి బి.నారాయణ, బిసి సంక్షేమ అధికారిణి ఎన్.రాజేశ్వరి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.