అణుపరిశోధనా కేంద్రంబార్క్ ఫిజిక్స్ గ్రూప్ డైరక్టర్ డాక్టర్ ఎస్ఎమ్.యూసుఫ్
గీతంలో భారత అణుశక్తి విభాగం 67వ వార్షిక సమావేశాలు
సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ పరిశోధనలపై చర్చలు
ప్రజాశక్తి- మధురవాడ : విశాఖలో దేశంలోనే అతి పెద్దదైన బార్క్ అణు పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు బార్క్ ఫిజిక్స్ గ్రూప్ డైరక్టర్ డాక్టర్ ఎస్ఎమ్.యూసఫ్ అన్నారు. బుధవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో భారత అణుశక్తి విభాగానికి అనుబంధంగా గల బోర్డు ఆఫ్ రీసెర్చి ఇన్ న్యూక్లియర్ సైన్సెస్ ఆధ్వర్యంలో సాలిడ్ స్టేట్ ఫిజిక్స్పై నిర్వహించిన 67వ వార్షిక సమావేశాలను ప్రారంభించారు.. వందలాద మంది అణుశాస్త్ర పరిశోధకులు పాల్గొన్న సమావేశంలో డాక్టర్ యూసుఫ్ మాట్లాడుతూ విశాఖలలో నెలకొల్పనున్న బార్క్ ఆటమిక్ రీసెర్చి సెంటర్ ద్వారా క్వాంటం ఫొటేనిక్స్ వంటి అంశాలపై అధ్యయనాలు చేస్తామన్నారు. విశాఖలోని పరిశోధన సంస్థలకు, గీతం వంటి విద్యాలయాలకు మేధోసహకారాన్ని అందిస్తూ మెరుగైన పరిశోథనలను బార్క్ సెంటర్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. బార్క్ ఆస్ట్రో ఫిజికల్ సైన్సెస్ విభాగం లడాఖ్లో నెలకొల్పిన అట్మాస్ఫియిరిక్ టెలిస్కోప్ ద్వారా జరుగుతున్న పరిశోధనలను వివరించారు. గీతం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ దయానంద సిద్దవట్టం మాట్లాడుతూ, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల మధ్య అంతర్విభాగ పరిశోధనలు చేపట్టాలని సూచించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం బెంగుళూరు ప్రాంగణంలో సైన్స్ పార్క్ను నెలకొల్పుతున్నామని, హైదరాబాద్ ప్రాంగణంలో ఔషధ పరిశోధనల కేంద్రం ఏర్పాటు కానుందన్నారు.. గీతం విశాఖ ప్రాంగణంలో మూర్తి పరిశోధన కేంద్రం బార్క్, మెడ్టెక్ జోన్ వంటి సంస్థలతో కలిసి ముందుకు నడవడానికి సిద్దంగా ఉందన్నారు. భౌతిక శాస్త్ర కోణం నుంచి జీవ శాస్త్రాలను పరిశోధించాలని నూతన ఆవిష్కరణలను వెలుగులోకి తేవాలన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ కెఎస్.కృష్ణ మాట్లాడుతూ సైన్స్ పరిశోధనలు ద్వారా నూతన విజ్ఞాన శాస్త్రాలు ఆవిర్భవిస్తున్నాయన్నారు. సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ద్వారా భౌతిక శాస్త్రంలో నూతన విభాగాలను వివరించారు. సదస్సు కన్వీనర్లు డాక్టర్ ఎల్ఎమ్.పంత్, డాక్టర్ జి.రవికుమార్ మాట్లాడారు. సదస్సు కార్యదర్శి డాక్టర్ మోహిత్ త్యాగి, గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ భౌతిక శాస్త్ర విభాగం అధిపతి చైతన్య వర్మ సదస్సులో చర్చించే అంశాలను వివరించారు.
వార్షికోత్సవాలను ప్రారంభిస్తున్న డాక్టర్ యూసుఫ్