మాట్లాడుతున్న మంత్రి కాకాణి
హామీలను అమలు చేసిన సిఎం
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను సైతం అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎంపిడిఒకార్యాలయంలో వైఎస్సార్ ఆసరా నాల్గవ విడత నిధులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రత్యూష రాణి అధ్యక్షతన, ఎపిఎం ముసునూరు శైలజ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కితాబు ఇచ్చారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నగదు జమ ఇచ్చిన హామీలను సంపూర్ణంగా సిఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు. జిల్లాలో నాలుగు విడతల్లో అక్క చెల్లెమ్మలకు రూ. 1074.39 కోట్లు ఆసరా కింద అందించినట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్సార్ ఆసరా రుణమాఫీ నగదును నాలుగు విడతలు విజయవంతంగా విడుదల చేసి, మహిళలకు ఇచ్చిన ప్రధాన హామీని సంపూర్ణంగా నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని పేర్కొన్నారు.సోమవారం తోటపల్లిగూడూరు ఎంపీడీఓ కార్యాలయంలో వైఎస్సార్ నాలుగో విడత నగదు పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్లను, సైడ్ కాలువలను నిర్మించామని తెలిపారు. తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లను చేశామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం అభివద్ధికి ఎల్లవేళలా కషి చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో తన వంతు కషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, ఏపీ డైరీ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి, ఎంపీపీ ఉప్పల శంకరయ్య గౌడ్, తలమంచి సురేంద్ర బాబు, మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్, గూడూరు విష్ణుమోహన్ రెడ్డి, ఇసనాక రమేష్ రెడ్డి, జెడ్పిటిసి శేషమ్మ, తహశీల్దార్ లావణ్య, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు వైఎస్సార్ ఆసరా లబ్ధిదారులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.