ప్రజాశక్తి-అరకులోయ రూరల్:మండలంలోని పెదలబుడు మేజర్ పంచాయితీ పెదలబుడు గ్రామంలో తాగునీరు అందక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో 350 కుటుంబాలు 1200 పైగా జనాభా నివసిస్తున్నారు. రెండేళ్ల నుండి నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత సేపు మోటార్ వేసినా నీరు ట్యాంక్కు పూర్తి స్థాయిలో ఎక్కక పోవడంతో నీరు సరఫరా కాలేదని గ్రామస్తులు తెలిపారు. వీధిలకు కుళాయి కనెక్షన్లు ఉన్నపటికీ చుక్క నీరు రాలేదని దీంతో వేరే ప్రాంతాలకు వెళ్లి కుళాయిల వద్ద పడిగాపులు కాసి నీరు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది.దీంతో దిష్టిబొమ్మల్లా కుళాయిలు దర్శనమిస్తున్నాయి. ట్యాంక్ కుళాయి కనెక్షన్లు ఉన్నపటికీ పట్టించుకునే నాయకుడే కరువయ్యాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని ట్యాంకు నుంచి గ్రామానికి నీరు సరఫరా చేయాలని లేకపోతే ట్యాంకర్ల ద్వారా ఇంటింటికి నీరు సరఫరా చేయాలని మహిళలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.