విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
గుంతకల్లు : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసింది చెప్పడానికే వైసిపి ప్రభుత్వం సామాజిక సాధికార బస్సుయాత్ర చేపట్టిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈనెల 9న నియోజకవర్గంలో జరుగనున్న సామాజిక సాధికార బస్సుయాత్ర సభా ప్రాంతాన్ని శనివారం ఎంపీ తలారి రంగయ్య, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గిరిజమ్మ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, మున్సిపల్ ఛైర్పర్సన్ భవాని, వైస్ ఛైర్పర్సన్లు మైమున్, నైరుతిరెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ రామలింగప్పలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీ వర్గాలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు చెప్పాడానికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సాధికార బస్సుయాత్ర చేపట్టిందని అన్నారు. గుంతకల్లు నియోజక వర్గంలో ఆరు కిలోమీటర్ల బస్సుయాత్ర చేపట్టి పట్టణంలోని వైఎస్ఆర్ కూడలిలో సభ ఏర్పాటు జరపాలని నిర్ణయించామని అన్నారు. ఈ బస్సుయాత్ర జయప్రదం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.