నీటి సరఫరాను పరిశీలిస్తున్న మేయర్ మహమ్మద్ వసీం
ప్రజాశక్తి-అనంతపురం
కార్పొరేషన్వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజలు నీటి వినియోగం తగ్గించుకోవడంతోపాటు పొదుపుగా వాడుకోవాలని మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. సోమవారం నగరంలోని 29, 30వ డివిజన్ల పరిధిలో డిప్యూటీ మేయర్ విజయ భాస్కర్రెడ్డితో కలిసి ఆయా డివిజన్లలో సరఫరా అవుతున్న నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇటీవల మోటార్లు కాలిపోవడం వల్ల తాగునీటి సమస్య తలెత్తిందన్నారు. నగర ప్రజలకు తగు మోతాదులో పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన అనంతరమే తాగునీరు అందిస్తున్నామన్నారు. మోటారు రిపేరు చేసిన అనంతరం నీటి పరిమాణం పెరగడంతో చివరలో ఉన్న నివాసాలకు కూడా తాగునీరు అందుతున్నట్లు తెలిపారు. ప్రజల అనుమానాలను తీర్చడం కోసం ప్రజల సమక్షంలోనే కాలనీలలో నీటి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. రోజూ నగరపాలక తాగునీటి విభాగం సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తుంటారు. నీటిని సద్వినియోగం చేసుకోవడంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉందని, ముఖ్యంగా మహిళలు నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇఇ సూర్యనారాయణ, డిఇ సుబాష, కార్పొరేటర్లు సిబ్బంది పాల్గొన్నారు.