అనంతపురంలో మున్సిపల్ కార్మికుల సమ్మెలో ప్రసంగిస్తున్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు
అనంతపురం కార్పొరేషన్ : మున్సిపల్ పారిశుధ్య, ఇంజినీరింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని ప్రతిపక్ష నేతగా వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అయిన తరువాత విస్మరించారని మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, సిఐటియు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ పారిశుధ్య, ఇంజినీరింగ్ కార్మికులు మంగళవారం నాడు సమ్మెబాట పట్టారు. సమ్మె ప్రారంభం సందర్భంగా కార్మికులందరూ పనిముట్లతో టవర్క్లాక్ నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడ బైటాయించి నిరసన తెలిపారు. మున్సిపల్ యూనియన్ నగర అధ్యక్షులు బండారి స్వామి అధ్యక్షతన నిర్వహించిన సమ్మె ప్రారంభం కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ ఎన్నికల ముందు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మాట తప్పారు.. మడమా తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులు ఏళ్ల తరబడి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారన్నారు. అధికారంలోకి రాగానే కార్మికుల అన్ని సమస్యలను తీరుస్తాన్న జగన్మోహన్రెడ్డి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా వాటిని పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు. వేతనాల పెంపునకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి విలాసవంతమైన భవన నిర్మాణాలకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు ఇచ్చి, ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెరిగిన నగర జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యనూ పెంచామన్నారు. పెండింగ్లో ఉన్న డిఎలు ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. సిపిఎస్ రద్దును రద్దు చేసి ఓపిఎస్ అమలు చేయాలన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్ వేతనాలు అమలు చేయాలన్నారు. మున్సిపల్ పారిశుధ్య యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు ఎటిఎం.నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడంలో ముఖ్యమంత్రి కావాలనే తాత్సారం చేస్తున్నారన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ. కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గురురాజా, వెంకటనారాయణ, ముత్తాజ, ఇంజినీరింగ్ విభాగం జిల్లా నాయకులు మల్లికార్జున, సంజీవరాయుడు, నగర అధ్యక్ష, కార్యదర్శులు బండారి ఎర్రిస్వామి, తిరుమలేశు, మున్సిపల్ యూనియన్ జిల్లా కోశాధికారి ఆదినారాయణ ఎమ్మార్పీఎస్ అనుబంధ నాయకులు నల్లప్ప, భగత్ సింగ్ ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఆది, ఆజాం మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గౌస్ మోదిన్ సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం నగర అధ్యక్ష, కార్యదర్శులు ఓబులపతి, పోతులయ్య, మహిళా నాయకులు వరలక్ష్మీ, లక్ష్మీనరసమ్మ కాంతమ్మ, లక్ష్మీదేవి, సర్దానమ్మ, ఇమాంబి, రవి ప్రభాకర్, శేషాంద్ర కుమార్ పాల్గొన్నారు.