సభలో మాట్లాడుతున్న వైసిపి ఎంపీ అభ్యర్థి శంకరనారాయణ
ప్రజాశక్తి-అనంతపురం
శింగనమలలో ఏపార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుస్తారో.. అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ను పునరావృతం చేయాలని వైసిపి ఎంపీ అభ్యర్థి శంకరనారాయణ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులుతో కలిసి మంగళవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన రోడ్షోకు వేలాదిగా నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో మండల కేంద్రం జనసంద్రంగా మారింది. అనంతరం బస్టాండ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే అదేపార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కావున నియోజకవర్గ ప్రజలు చాలా తెలివివంతులని, ఎవరిని గెలిపించాలో బాగా తెలుసు అన్నారు. కాగా జగన్ అధికారంలోకి వచ్చాక గ్రామాలకే పరిపాలన తీసుకురావడంతోపాటు పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే చేర్చారన్నారు. ఆయా పథకాలు కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా వీరాంజనేయులును ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ రాగే పరుశురాం, డిసిఎంఎస్ డైరెక్టర్ బొమ్మన శ్రీరామిరెడ్డి, రాష్ట్ర నాయకులు వడిత్యా శంకర్నాయక్, ఎంపిపి యోగేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.