ప్రజాశక్తి -అనకాపల్లి : జివిఎంసి విలీనగ్రామం కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో బుధవారం స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జివిఎంసి జోనల్ కమిషనర్ ఆయ్యప్పనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 84వ వార్డు టిడిపి ఇన్ఛార్జి మాదంశెట్టి నీలబాబు మాట్లాడుతూ స్వచ్ఛసర్వేక్షణ్పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత తీసుకోవాలని, చిత్తుకాగితాలు, చెత్తాచెదారాన్ని ఎక్కడికక్కడే వేయకుండా డస్ట్బిన్లను వాడాలని సూచించారు. ఇంటివద్ద తల్లిదండ్రులకు పరిశుభ్రత, పచ్చదనం, స్వచ్ఛసర్వేక్షణ్పై తెలియజెప్పి, వారు సైతం పాటించేలా చూడాలని సూచించారు. పరిశుభ్రత, చదువులో పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. జోనల్ కమిషనర్ అయ్యప్పనాయుడు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, తద్వారా దోమలు, క్రిమి కిటకాలు వృద్ధి చెందవని, దీనివల్ల అనేక వ్యాధులు దరిచేరవన్నారు. శానిటరీ సూపర్వైజర్ ఆర్ రవికుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్ మాణిక్యాలరావు ఎం అప్పారావు, సిహెచ్ గణేష్, శానిటరీ సెక్రటరీలు డి.భాస్కరరావు, వి గీత, సన్యాసి, కె.రాజు మలేరియా విభాగం అధికారులు, సిబ్బంది, తెలుగుదేశం నాయకులు బోయిన మురళి వానపల్లి బాబురావు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న నీలబాబు