రాంచీ : త్వరలో జార్ఖండ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్లో బిజెపి తుడిచిపెట్టుకుపోతుందని, దానికోసం తాను కృషి చేస్తానని ఆ రాష్ట్ర మాజీ సిఎం హేమంత్ సోరెన్ అన్నారు. సోరెన్ శుక్రవారం మనీలాండరింగ్ కేసులో బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం ఆయన రాంచీలో జెఎంఎం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించాలని పగటి కలలు కంటోంది’ అని సోరెన్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా బిజెపిపై తీవ్రంగా మండిపడ్డారు. ‘మాపై కుట్ర పన్నిన వారికి తగిన సమాధానం చెబుతాం. బిజెపి శవపేటికకు చివరి మేకు వేసే సమయం వచ్చింది. జార్ఖండ్లో బిజెపి తుడిచిపెట్టుకుపోతుంది. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే జరగవచ్చని నాకు సమాచారం అందింది. అందుకు మేం సిద్ధంగా’. ఉన్నాం అని అని ఆయన అన్నారు.
మనీలాండరింగ్ కేసు గురించి ఆయన ఈ సమావేశంలో మాట్లాడారు. ‘నిజాన్ని ఎవరూ దాచలేరు. త్వరలో లేదా ఆ తర్వాతైనా అది బయటకు వస్తుంది. మరోసారి మీకు నాయకత్వం అందించడానికి మీ ముందుకు వచ్చాను’ అని ఆయన అన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/hemanth-soren-copy.jpg)