అవినీతి లేకుండా చేస్తాం

May 10,2024 00:11 ##Bapatla #Congress

ప్రజాశక్తి – బాపట్ల
అవినీతి రహిత పాలనే లక్ష్యంగా బాపట్లను తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ అభ్యర్థి గంటా అంజిబాబు అన్నారు. పట్టణంలో ఆయన స్వగృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్కువ సమయంలో తనను ఎంఎల్‌ఎ అభ్యర్ధిగా కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించిందని అన్నారు. తక్కువ సమయం కారణంగా నియోజకవర్గంలోని ఓటర్లను అందరినీ ఇళ్లకు వెళ్లి ఓటు అడగలేకపోతున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో వైసిపి, టిడిపి ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసే దిశగా జిమ్మిక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ తరుణంలో కాంగ్రెస్‌కు ఓటేసి ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎంఎల్‌ఎగా తనను, బాపట్ల ఎంపీగా జెడి శీలంను గెలిపించాలని కోరారు. సమావేశంలో దోనేపూడి దేవరాజు, మరియమ్మ, బక్కా రోశయ్య, దండు రేణుక, దేవరకొండ రాము, ఎస్‌విఆర్ కుమార్ పాల్గొన్నారు.

➡️