పకడ్బందీగా ఓట్ల లెక్కింపు 28న కౌంటింగ్ సిబ్బందికి మొదటి విడత శిక్షణా తరగతులు : కలెక్టర్ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ సార్వత్రిక ఎన్నికలు -2024కు సంబంధించి జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను రిటర్నింగ్ అధికారులు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని విధాల పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.షణ్మోహన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, 172 – చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి. శ్రీనివాసులుతో కలసి 165 – పుంగనూరు,170- నగిరి, 171- జీడి నెల్లూరు,173- పూతలపట్టు,174- పలమనేరు, 175- కుప్పం నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులతో సమావేశమై కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి సిబ్బంది నియామకం, సిబ్బంది ర్యాండమైజేషన్, కౌంటింగ్ సిబ్బంది శిక్షణా తరగతుల నిర్వహణ, కౌంటింగ్ హాల్లో వీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు ఏర్పాటు, నియోజకవర్గ స్థాయిలో శాంతి భద్రతల నిర్వహణ కౌంటింగ్కి రాజకీయ పార్టీల తరపున ఏజెంట్లను నియామకం సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లు రిటర్నింగ్ అధికారులు బాధ్యతతో చేయాలని, కౌంటింగ్ నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమన్నారు. సజావుగా కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకంపై దష్టి పెట్టాలన్నారు. కౌంటింగ్ సూపర్వైజర్స్, అసిస్టెంట్ సూపర్వైజర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, మైక్రోఅబ్జర్వర్లు స్ట్రాంగ్ రూమ్ ఇంచార్జి, సిబ్బంది నియామకం పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్ నిర్వహణకు కేటాయింపబడ్డ సిబ్బందికి మొదటి ర్యాండమైజేషన్ చేసిన అనంతరం జిల్లాస్థాయిలో ఈనెల 28న మొదటి విడత శిక్షణాతరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండో విడత శిక్షణ తరగతులు జూన్ 3న అబ్జర్వర్ల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రిటర్నింగ్ అధికారులు వారి నియోజక వర్గానికి సంబంధించి కౌంటింగ్ అసెంబ్లీ, పార్లమెంటు, విడివిడిగా జరుగుతుందని అందుకు అవసరమైన పూర్తి సిబ్బంది నియామకంను పూర్తి చేసుకోవాలని తెలిపారు. సిబ్బందికి గుర్తింపు కార్డులను అందజేయాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు కౌంటింగ్ సంబంధించి ఏజెంట్ల నియామకంలో రిటర్నింగ్ అధికారికి ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ప్రతి రౌండ్వారీగా సమాచారాన్ని మీడియా సెంటర్కు చేరవేసేందుకు సమాచార శాఖ తరపున ప్రతి నియోజకవర్గానికి ఒకరిని నియామకం చేయడం తెలిపారు. నియోజకవర్గాలలో శాంతిభద్రతల నిర్వహణకు రిటర్నింగ్ అధికారులు పోలీసు అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలన్నారు. కౌంటింగ్ కు ముందు గా విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడ శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా అప్రమత్తంగా ఉంటూ లా అండ్ ఆర్డర్ను నిర్వహించాలన్నారు. సమావేశంలో డిఆర్ఓ బి.పుల్లయ్య, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, రిటర్నింగ్ అధికారులు మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకటశివ, చిన్నయ్య మనోజ్ రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.