ఇంటింటికి ప్రజా నిధి సేకరణలో సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు
ప్రజాశక్తి-వి కోట : రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల పక్షాన ఉద్యమాలు నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ నేతలు శుక్రవారం వి.కోటలో ఇంటింటికి ప్రజా నిధి సేకరణ చేస్తున్న సందర్భంగా ఆదరించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి ప్రజా నిధి సేకరణలో భాగంగా రెండవరోజు వి.కోటలో ఇంటింటికి ప్రజా నిధి సేకరణ కార్యక్రమం చేస్తున్నామని ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమం 15వ తేదీ వరకు జరుగుతుందని ప్రజలు శ్రేయోభిలాషులు అందరూ సిపిఎం పార్టీకి ప్రజా నిధిని ఇచ్చి సహకరించాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రతి బూర్జువా పార్టీ ప్రజల దగ్గరకు వచ్చి అబద్దాలు చెప్పి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి ఓట్లు అడుగుతారని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై భారాల మీద భారాల మోపుతారని విమర్శించారు. కానీ సిపిఎం మాత్రం ప్రజల నుంచే ప్రజానిధి వసూలు చేసి ప్రజల కోసం పనిచేస్తుందని తెలిపారు. బూర్జువా పార్టీలు కార్పొరేట్ శక్తుల వద్ద కాంట్రాక్టుల వద్ద వేల కోట్లు వసూలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కోసం ప్రభుత్వాలు పనిచేస్తాయని తెలిపారు. కానీ దానికి భిన్నంగా సిపిఎం పార్టీ ప్రజల నుంచే ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తున్నది అన్నారు. రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం, ఉపాధి కోసం, మహిళలపై జరుగుతున్న దాడులపై నిరసనగా, ప్రజలపై భారం పడుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు రేట్లు తగ్గించాలని అనేక రకాల పోరాటాలు నిర్వహించిన ఘనత సిపిఎందేనని అన్నారు. అందువల్లే ప్రజలందరూ కూడా సిపిఎం ఉద్యమాలను సిపిఎం కార్యక్రమాలను బలపరిచి పార్టీ బలోపేతానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు భువనేశ్వరి, గిరిధర్ గుప్తా, ఓబుల్ రాజు, ఈశ్వరయ్య మరియు వి.కోట మండల నాయకులు బాలసుబ్రమణ్యం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.