ఉపాధ్యాయ, ఉద్యోగుల దీక్షలను ప్రారంభించిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్
ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల, ఉద్యోగులు దాచుకున్న డబ్బులను 18 వేల కోట్ల రూపాయలను ఇతర వాటికి మళ్ళించి వారికి ఇవ్వకపోవడం దారుణమని బకాయి ఉన్న వాటిని వెంటనే చెల్లించాలని బుధవారం యుటిఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు మాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి ఉద్యోగం చేసి జీతంలో నుండి కోత విధించుకుని భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని దాచుకున్న డబ్బులను ప్రభుత్వం దుర్మార్గంగా అక్రమంగా వేరే పథకాలకు మళ్లించడం దారుణమని వెంటనే బకాయి ఉన్న 18,000 కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేస్తుంటే అతి దారుణంగా వారిపై నిర్బంధాలు ప్రయోగించి అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. విద్యా వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసి పేద, మధ్యతరగతి వర్గాలకు విద్యను దూరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుతుందన్నారు. ఇప్పటివరకు ఐదు సంవత్సరాల కాలంలో ఒక డీఎస్సీ కూడా ఇవ్వకుండా నిరుద్యోగులకు ఇబ్బందులకు గురి చేశారు. ఇలాంటి ప్రభుత్వానికి ఉద్యోగులు ఉపాధ్యాయులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకముందే ఉపాధ్యాయుల బకాయిలను విడుదల చేసి వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.