నిత్యం ట్రాఫిక్‌ అంతరాయం

ప్రజాశక్తి-మార్కాపురం: మార్కాపురం పట్టణంలో రహదారులు చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి. పైగా ట్రాఫిక్‌ రద్దీ పెరిగింది. దీంతో పాటు ఆవుల సంచారం కూడా అధికమే. రహదారులపై ఆవుల సంచారంతో నిత్యం ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. దీంతో జనం అవస్థలకు గురవుతున్నారు. ఆవుల సంచారాన్ని అధికారులు నియంత్రించలేకపోవడంపై విమర్శలు వినవస్తున్నాయి. మార్కాపురం మున్సిపాలిటీలో ప్రధాన రహదారులన్నీ నిత్యం రద్దీగా ఉంటాయి. వాహనాలూ అధికమే. వ్యాపారాలన్నీ రహదారులపై కొనసాగుతున్నాయి. ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడింది. పెరిగిన వాహనాల రాకపోకలతో రహదారులన్నీ జామ్‌ అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఆవుల సంచామూ పెరిగింది. రహదారిపై అడ్డంగా నిలబడటంతో ట్రాఫిక్‌ కూడా ఆగిపోవాల్సి వస్తోంది. మున్సిపాలిటీ అధికారులు దీనిపై స్పందించడం లేదు. కొన్ని సందర్భాల్లో ఆవులతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కౌన్సిల్‌ సమావేశంలోనూ పలుమార్లు కౌన్సిలర్లు ఆవులతో జరిగే నష్టం, ఇబ్బందులను లేవనెత్తినా గోశాల కడుతున్నామని, అక్కడకు ఆవులన్నీ చేర్చుతామని చెప్పడమే కానీ ఆచరణలో చేయలేకపోతున్నారు. ఆవుల యజమానులకు నోటీసులు ఇచ్చి.. కనీసం హెచ్చరించినా కొంత సమస్య తగ్గేది. కానీ ఆ పని కూడా ఇక్కడి అధికారులు చేయకపోవడంతో ఆవుల సమస్య జఠిలంగా మారుతోంది. రహదారులపైకి వదిలే ఆవులను ఇతర ప్రాంతాలకు తరలిస్తామని హెచ్చరికలు జారీ చేస్తే ఏ ఒక్క ఆవు కూడా రహదారిపైకి రాదని కొందరి వాదన. ఆ దిశగా మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది ప్రజల విజ్ఞప్తి.

➡️