ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
జిల్లాలో టెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. మార్చి 9వరకూ ఈ పరీక్షలు జరుగుతాయని జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి కె.వాసుదేవరావు తెలిపారు. స్థానిక లూథర్ గిరిలోని రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లోని ఇయాన్ డిజిటల్ జోన్, ఐడి జెడ్ లూథర్ గిరి కేంద్రాలను ఆయన మంగళవారం సందర్శించారు. వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్ష రెండు సెషన్లుగా జరుగుతుందన్నారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకూ, రెండో సెషన్ 2.30 నుంచి 5 గంటల వరకూ జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అభ్యర్థులు నిర్దేశిత సమయానికే హాజరావాలన్నారు. ఇయాన్ డిజిటల్ జోన్ సెంటర్లో జరిగిన పరీక్షకు మొదటి సెషన్లో 730 మందికి 665 మంది హాజరయ్యారని డిపార్ట్మెంటల్ ఆఫీసర్ దిలీప్ కుమార్ తెలిపారు. రాజమహేంద్రవరం డివైఇఒ విబిఎస్.నారాయణ ఆయన వెంట ఉన్నారు.
![టెట్](https://prajasakti.com/wp-content/uploads/2024/02/4-58.jpg)